కాకాణి చొరవతోనే కళాశాలకు భూమి కేటాయింపు
మనుబోలు : మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సొంత భవనం కోసం భూమి కేటాయించడం ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి చొరవతోనే జరిగిందని వైయస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి ఆవుల తులసీయాదవ్ అన్నారు. స్థానిక జూనియర్ కళాశాల సమీపంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ 2001–02 లోనే మనుబోలులో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటైనప్పటికీ సొంత భవనం లేకపోడంతో హైస్కూల్లోని మిగులు గదుల్లో చాలిచాలని వసతులతో నిర్వహిస్తున్నారన్నారు. ఈ విషయాన్ని తాము గతంలో పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ప్రయోజనం లేకపోయిందన్నారు. కాకాణి ఎమ్మెల్యే అయ్యాక కళాశాల సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి ఆయన కలెక్టర్, ఆర్జేడీలతో మాట్లాడి సొంత భవనం కోసం నాబార్డ్ ద్వారా నిధులు, భూమి కేటాయించేలా చర్యలు తీసుకున్నారన్నారు. అయితే అధికార పార్టీ నేతలు తమ కృషి ఫలితంగా ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నాయకులు విష్ణు, పెంచలయ్య, భార్గవ్, వంశీ పాల్గొన్నారు.