కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటనకు చక్కటి స్పందన
4 Aug, 2015 12:55 IST
విజయవాడ : కృష్ణా జిల్లా పర్యటనకు విచ్చేసిన ప్రతిపక్ష నేత,
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు ఆత్మీయ స్వాగతం లభించింది.
హైదరాబాద్ నుంచి ఈ ఉదయం విమానంలో బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి
చేరుకొన్నారు. అక్కడ నుంచి రోడ్ మార్గంలో కొత్త మాజేరుకి బయలు దేరారు.
మొదటగా వల్లూరు పాలెంలో ఆయనకు స్థానిక నాయకులు, కార్యకర్తలు
ఆత్మీయ స్వాగతం పలికారు.
కొత్త మాజేరు లో రెండున్నర నెలల
నుంచి అంతు చిక్కని విష .జ్వరం పీడిస్తోంది. ఈ రెండు న్నర నెలల్లోనే 18
మంది మృత్యు వాత పడ్డారంటే దీని విస్తృతిని అర్థం చేసుకోవచ్చు. రెండు
వేల జనాభా కలిగిన ఈ గ్రామంలో ప్రతీ రెండు ఇళ్లకు ఒకరు చొప్పున ఈ
జ్వరంతో బాధ పడుతున్నారు. ఈ ఊరికి ప్రధానంగా ఒక చెరువు, దీని ఆధారంగా
ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ మాత్రమే తాగునీటి అవసరాలు తీరుస్తున్నాయి.
ఈ చెరువు లో నీరు కలుషితం కావటంతో అదే కలుషిత నీటిని అరకొర గా
శుభ్రపరచి ఊరంతా సరఫరా చేస్తున్నారు.
ఊర్లో విషజ్వరాలు
ప్రబలాయి అని తెలిసిన వెంటనే వైఎస్సార్సీపీ నాయకులు బృందాలుగా రెండు
సార్లు అక్కడ పర్యటించారు. సమస్య తీవ్రతను మండల అధికారులు, జిల్లా
కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్లారు. అయినప్పటికీ ఫలితం లేదు. తూతూ
మంత్రంగా ఒక వైద్య శిబిరం ఏర్పాటు చేసి చేతులు దులుపుకొన్నారు. విషయ
తీవ్రతను గుర్తించిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అక్కడ
పర్యటించాలని నిర్ణయించారు.