కేఈ కృష్ణమూర్తి రాజీనామా చేయాలి
కర్నూలు: ఇసుక మాఫియాకు పాల్పడిన కేఈ శ్యాంబాబు తండ్రి కేఈ కృష్ణమూర్తి డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ ఇన్చార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. హంద్రీ పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ తవ్వకాలు, మాఫియాపై విచారణ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్వాగతించారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబుపై రైతులు చేసిన పిర్యాదులు, ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన వెల్దుర్తిలో విలేకరులతో మాట్లాడారు. చెరుకులపాడు, కొసనాపల్లె, కృష్ణగిరి ప్రాంతాలలో ఇసుక అక్రమ తరలింపుతో భూగర్భజలాలు తగ్గుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు పడుతున్న ఇబ్బందులపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని విమర్శించారు. ఎట్టకేలకు న్యాయస్థానం స్పందించి విచారణకు ఆదేశించడం శుభపరిణామమన్నారు. కేఈ శ్యాంబాబు హస్తంపై విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే జిల్లా అధికారులపై అధికారపార్టీ ఒత్తిడి ఉండరాదన్నారు. ఈ ఘటనలకు నైతిక బాధ్యత వహించాలన్నారు.