బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటం ఉధృతం

23 Nov, 2015 23:18 IST


విజయవాడ : ప్రజాందోళనలకు అండగా నిలబడటంతో పాటు రైతుల పక్షాన బలవంతపు భూ సేకరణకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. పోర్టుకు 4800 ఎకరాలు ఇచ్చేందుకు అభ్యంతరం లేదని రైతులు చెబుతున్నారని, పరిశ్రమల పేరుతో 30 వేల ఎకరాలు స్వాధీనం చేసుకోవడానికి వ్యతిరేకంగా పోరాటం చేయటాన్ని ఎవ్వరూ ఆపలేరనేది రైతుల పక్షాన వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రకటించారు.
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని)పై పోలీసు కేసుల నేపథ్యంలో ఆ పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు రెండు రోజులుగా సమావేశమై చర్చించారు. బుధ, గురు వారాల్లో కృష్ణా జిల్లా ఇన్‌చార్జి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లాలో పర్యటించారు. పేర్ని నానిని పరామర్శించారు. ఉద్యమానికి భరోసా ఇచ్చారు.