విజయమ్మ నిరశన దీక్షకు మద్దతు తెలపండి

17 Aug, 2013 10:46 IST
అనకాపల్లి (విశాఖపట్నం జిల్లా) :

రాష్ట్ర విభజన విషయంలో నిరంకుశంగా, ఏకపక్షంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ తీరుకు నిరసనగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ చేపడుతున్న ఆమరణ దీక్షకు మద్దతు తెలిపేందుకు పార్టీ శ్రేణులు కదిలి రావాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ నెల 19 నుంచి శ్రీమతి విజయమ్మ విజయవాడలో నిరవధిక నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. అనకాపల్లిలోని కొణతాల క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పార్టీ కార్యకర్తలతో ఆయన సమీక్షించారు.

ఈ సందర్భంగా కొణతాల మాట్లాడుతూ.. విజయవాడలో శ్రీమతి విజయమ్మ చేపట్టే నిరవధిక నిరాహార దీక్షకు సంఘీభావంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ నిరశన దీక్షలు చేయాలని సూచించారు. ఈ నెల 22 నుంచి విశాఖ జిల్లాలో పార్టీ చేపట్టే సమైక్య బస్సు యాత్రలను విజయవంతం చేసే బాధ్యత అందరిదీ అన్నారు. తెలంగాణ ఇచ్చేశామని ఒక వైపున కాంగ్రెస్‌ అధిష్టానం చెబుతూ ఉంటే.. మరో పక్కన సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆ పార్టీ నాయకులు ఏ ముఖం పెట్టుకుని పాల్గొంటారని కొణతాల నిలదీశారు.