వైయస్ జగన్ పాదయాత్రతో టీడీపీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయివైయస్ఆర్సీపీ సత్తనపల్లి సమన్వయకర్త అంబటి రాంబాబు
గుంటూరు: కోడెల శివప్రసాద్ కుటుంబం అవినీతి గిన్నీస్ బుక్ రికార్డుల్లో ఎక్కిందని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. సత్తనపల్లె సభలో ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశంలో ఏ నాయకుడు తలపెట్టని సుదీర్ఘ యాత్రను వైయస్ జగన్ చేపట్టారన్నారు. ఇవాళ 1600 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. వైయస్ జగన్ పాదయాత్రతో టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని చెప్పారు. సత్తనపల్లి నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉందన్నారు. మహానుబావుడు వావిలాల గోపాలకృష్ణయ్య పాలించిన గడ్డ ఇది అన్నారు. గాంధేయవాది, అహింసావాది, నీతి, నిజాయితీకి మారుపేరుగా మార్చిన సత్తనపల్లెని ఇప్పుడు దుర్మార్గపు కోడెల కుటుంబం పరిపాలిస్తుందని ప్రజలందరూ అంటున్నారని చెప్పారు. ఈ నియోజకవర్గంలో కేవలం 900 ఓట్లతో గెలుపొందిన కోడెల శివప్రసాద్ చేస్తున్న అక్రమాలు ఎవరిని అడిగినా చెబుతారు. మార్కెట్లో ఒక సామెత ఉందన్నారు. ఒకటి కొంటే ఇంకొటి ఫ్రీ అని విన్నాం. కానీ సత్తనపల్లిలో కోడెల కుమారుడు, కుమార్తె ఇద్దరూ చలామణి అవుతున్నారన్నారు. వారు వైద్యంలోనే కాదు..అవినీతిలో కూడా డాక్టరేట్ పొందారని విమర్శించారు. మరుగుదొడ్లలో కూడా అవినీతికి పాల్పడ్డారన్నారు. స్మశాన వాటికల్లో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇక్కడ దోచుకున్న డబ్బుతో గుంటూరులో మల్టీఫెక్స్ థియోటర్ కడుతున్నారన్నారు. సత్తనపల్లె మున్సిపాలిటి నుంచి సిబ్బందిని తీసుకెళ్లి పని చేయించుకోవడం సిగ్గులేదా అని ప్రశ్నించారు. కోళ్లఫారాన్ని కోడెల అనుచరులు ధ్వంసం చేశారన్నారు. గిన్నీస్బుక్ రికార్డుల్లో కోడెల కుమారుడు, కుమార్తె అవినీతి నమోదు చేయవచ్చు అన్నారు. కాళహస్తి–నడికుడి రైల్వే ట్రాక్ కాంట్రాక్టర్లపై దాడి చేశారని తెలిపారు. ఇదే విషయంపై రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్తే సీఎం చంద్రబాబు హెచ్చరించారన్నారు. మా అబ్బాయి దౌర్జన్యం చేస్తున్నారు సరే, మీ అబ్బాయి లోకేష్ సంగతేంటి అని ప్రశ్నించారట. ఈ ఇద్దరూ దొంగలే అని ఆయన విమర్శించారు.