కాంగ్రెస్ కొమ్ముకాస్తోంది చంద్రబాబే: విజయమ్మ
2 Apr, 2013 14:53 IST
హైదరాబాద్, 2 ఏప్రిల్ 2013: మంచిపనులు చేసిన వారెవరైనా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ పేర్కొన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఎప్పుడూ పన్నులు పెంచలేదన్నారు. వైయస్ దయతో అధికారం అనుభవిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారం వేస్తోందని శ్రీమతి విజయమ్మ మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షం టిడిపి నేత చంద్రబాబు నాయుడే కాంగ్రెస్కు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. మంగళవారం ఉదయం బషీర్బాగ్ నుంచి కరెంటు సత్యాగ్రహం వేదిక వద్దకు పాదయాత్రగా వెళుతూ ఆమె మీడియాతో మాట్లాడారు. 'పరిశ్రమలకిచ్చింది పవర్ హాలిడే... రైతులకు మిగిలింది క్రాప్ హాలిడే' అనే నినాదం రాసిన ప్లకార్డును శ్రీమతి విజయమ్మ చేతుల్లో పట్టుకుని నడిచారు.
మహానేత డాక్టర్ వైయస్ఆర్ భౌతికంగా దూరమైనా ఆయనపై, వైయస్ కుటుంబంపై కొందరు ఇంకా ఆరోపణలు చేస్తూనే ఉన్నారని విజయమ్మ విమర్శించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ అధినేత శ్రీ వైయస్ జగన్, ఆయన సోదరి శ్రీమతి షర్మిల ప్రజలకు అండగా ఉంటారని శ్రీమతి విజయమ్మ చెప్పారు. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం టిడిపిలకు ప్రజలే సరైన సమయంలో బుద్ధి చెబుతారని శ్రీమతి విజయమ్మ అన్నారు.