రాష్ట్రంలో ఒక్క సీటూ లేని బీజేపీతో చర్చలా?

13 Feb, 2014 12:57 IST
హైదరాబాద్:

మన రాష్ట్రంలో ఒక్క ఎంపీ కూడా లేని బీజేపీతో ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్‌ రాష్ట్ర భవిష్యత్తుపై విందు రాజకీయాల్లో చర్చించడం ఏమిటని వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు నిలదీశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో 75 శాతం మంది ప్రజలు విభజనను వ్యతిరేకిస్తుంటే ప్రధాని గాని, సోనియాగాంధీ గాని వారితో చర్చించకుండా బీజేపీతో ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.

విభజన బిల్లు విషయంలో కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ సంప్రదాయాలన్నింటినీ తుంగలోతొక్కి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని జూపూడి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విభజన బిల్లును ప్రజాస్వామ్య శక్తులన్నీ అడ్డుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లోపభూయిష్టమైన విభజన బిల్లును గట్టెక్కించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య సంప్రదాయాలను పక్కనపెట్టి కార్పొరేట్ కంపెనీ‌ మాదిరిగా పరుగులు తీస్తోందని దుయ్యబట్టారు. లోక్‌సభ స్పీకర్ మీరాకుమా‌ర్ సైతం ఆర్టికల్ 371 (డి)ని సవరించాల్సిన అవసరం ఉందా? లేదా? అనే అంశంపై న్యాయ సలహా కోరారంటేనే ఈ బిల్లు ఎంత తప్పుల తడకగా‌ ఉందో అర్థమవుతోందన్నారు.

త్వరలో ఎన్నికల షెడ్యూలు వెలువడుతున్న తరుణంలో మరో వారం రోజుల్లో ఇంటికి వెళ్లే ఈ ప్రభుత్వం విభజన బిల్లు విషయంలో ఎందుకు తొందరపడుతోందని ప్రభాకరరావు ప్రశ్నించారు. ఇదేమైనా దేశ అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన అత్యవసరమైన బిల్లా? అన్నారు. దేశంలో 60 కోట్ల జనాభా ఉన్న మహిళా సోదరీమణులకు చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పించే బిల్లా? ఎందుకంత తొందరపడుతున్నారు?‌ మహానేత డాక్టర్ వై‌యస్‌ఆర్ మరణానంతరం ప్రజల్లో ఉప్పొంగిన వై‌యస్ సానుభూతిని దెబ్బ తీసేందుకు తొలుత తెలంగాణ చిచ్చు రాజేశా‌రన్నారు. ఆ తరువాత టీడీపీతో కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేశారని ఆరోపించారు. ఇప్పుడు వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీని వచ్చే ఎన్నికల్లో నామరూపాల్లేకుండా చేయాలనే దుర్భుద్ధి, కుట్రతోనే ఇంత అప్రజాస్వామికంగా బిల్లును తీసుకొస్తున్నా‌రని దెయ్యబట్టారు.

విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిన నాటి నుంచీ చర్చించడానికి ఇందులో ఏమీ లేదని తొలి నుంచీ వైయస్ఆర్‌సీపీ చెబుతూ ఉన్నా ఏ మాత్రం పట్టించుకోలేదని జూపూడి తూర్పారపట్టారు. చర్చ జరిపించి చివరికి వచ్చేటప్పటికి ఇది ముసాయిదా బిల్లే కనుక తిరస్కరించాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాటకాలాడారని అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండటానికి వీరిద్దరూ చేసిందేమీ లేదన్నారు. విభజన నిర్ణయం వెలువడినప్పటి నుంచీ వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తీవ్రంగా ప్రతిఘటిస్తూనే ఉన్నారన్నారు. జైలులో ఉండి కూడా ఆయన సమైక్యాంధ్ర కోసం దీక్ష చేశారన్నారు. లోక్‌సభను స్తంభింప జేసేందుకు బుధవారం శ్రీ జగన్ వెల్‌లోకి వెళ్లి నిరసన‌ తెలిపారు.