పచ్చచొక్కాల దౌర్జన్యం

1 Dec, 2015 15:48 IST
కృష్ణాః  జనయాత్రల పేరుతో టీడీపీ నేతలు జనంపై దాడులు, దోపిడీ యాత్రలు చేస్తున్నారు. కృష్ణా జిల్లాలోని పెద్దకర అగ్రహారం రైతులపై టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. పోర్టు అనుబంధ సంస్థలకు తమ భూములు కేటాయించకుండా మినహాయింపు ఇవ్వాలని ఇక్కడి రైతులు గత కొద్ది రోజులుగా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని మరోసారి పరిశీలించాలని కోరుతున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది.

మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో జనచైతన్య యాత్రలు చేసేందుకు వచ్చిన టీడీపీ నేతలకు తమ వాణి వినిపించేందుకు భారీ సంఖ్యలో రైతులు అక్కడకు చేరుకున్నారు. మంత్రి అందుకు అనుమతించకపోవడంతో వారు నిరసన ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ డిమాండ్లను వ్యక్తపర్చారు. దీంతో, రెచ్చిపోయిన తమ్ముళ్లు యాత్రను అడ్డుకుంటారా అంటూ రైతులపై  ఒక్కసారిగా దాడులకు దిగారు. మెడలోని బంగారు గొలుసులు లాక్కున్నారు. బాధితులు టీడీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ భూములు ఇవ్వమని చెప్పినందుకు పచ్చచొక్కాలు దారుణంగా ప్రవర్తించారని రైతులు వాపోయారు.