జగన్ను సీఎం చేయడమే లక్ష్యం
వెనకబడిన రాష్ట్రాన్ని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అయ్యాక అభివృద్ధిచేసి చూపించారని, అలాంటి పాలన మళ్లీ కావాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర సమన్వయకర్త తలశిల రఘురాం, అమరచింత మాజీ ఎమ్మెల్యే స్వర్ణమ్మ, పార్టీ జిల్లా అడ్హాక్ కమిటీ సభ్యులు వర్కటం జగన్నాథ్రెడ్డి చెప్పారు. ఆత్మకూర్లోని వర్తక సంఘం భవనంలో పార్టీ కార్యకర్తలు, నాయకులతో ఏర్పాటైన సమావేశంలో వారు మాట్లాడారు. ఈనెల 29, 30తేదీల్లో మక్తల్ నియోజకవర్గం ఆత్మకూర్ మండలంలో జరిగే షర్మిల పాదయాత్రను విజయవంతం చేయాలని వారు కోరారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఒక్క ఆత్మకూర్ మండలంలోనే వేల కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. ఆ మహానేత పథకాలను నిర్వీర్యం చేయడంతోపాటు ఆ కుటుంబంపై దాడులను ప్రజలకు వివరించి ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేందుకు షర్మిల చేపడుతున్న మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు.