జగన్మోహన్ రెడ్డిని కలిసిన పార్టీల నేతలు
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని శనివారం పలువురు టీడీపీ, కాంగ్రెస్ నేతలు చంచల్గూడ జైలులో కలిశారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజక వర్గ తెలుగుదేశం పార్టీకి చెందిన బీసీ నేత, మాజీ ఎమ్మెల్సీ మల్లుల లక్ష్మీనారాయణ, అదే జిల్లాకు చెందిన మరో బీసీ నేత, తణుకు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీకి చెందిన చిర్ల రాధాకృష్ణ ఆయనను కలిసిన వారిలో ఉన్నారు. మహబూబ్నగర్ జిల్లా అమరచింత మాజీ ఎమ్మెల్యే సోమభూపాల్ రెడ్డి కుమారుడు శ్రీరాం భూపాల్ రెడ్డి కూడా శ్రీ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. భేటీ అనంతరం లక్ష్మీనారాయణ విలేకర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కు కుట్రల ఫలితంగానే శ్రీ జగన్మోహన్ రెడ్డిని జైలులో ఉంచారన్నారు. జనం శ్రీ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారనీ, తాను కూడా పార్టీ కోసం కృషి చేస్తాననీ చెప్పారు.