జగన్ను ఎదుర్కోవాలంటే...
జగన్ను ఎదుర్కోవాలంటే...
ఆ మంత్రులను తప్పించాల్సిందే
- సీఎంకు తేల్చిచెప్పిన కాంగ్రెస్ పెద్దలు?
హైదరాబాద్, 2012 ఆగస్టు 24 : ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కు సవాలుగా మారిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోమోహన్రెడ్డిని ఎదుర్కోవాలంటే, సీబీఐ అభియోగాలను ఎదుర్కొంటున్న మంత్రులను తొలగించక తప్పదని ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి స్పష్టం చేసినట్టు సమాచారం.
రాష్ట్ర పరిణామాలకు సంబంధించి శుక్రవారం ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీతో భేటీనున్న తరుణంలో ముఖ్యమంత్రి ఢిల్లీలో పలువురు కాంగ్రెస్ పెద్దలను కలుసుకున్నారు. ధర్మాన అంశంపై రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వారికి వివరించినప్పుడు వారంతా ఈ సలహా ఆయనకు ఇచ్చినట్లు సమాచారం.
కిరణ్ను మార్చాలన్న అంశంపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటే ధర్మాన రాజీనామాను ఆమోదించాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం రాదని, కొత్త ముఖ్యమంత్రి కేబినేట్లో ఆయన ఉండరన్న అభిప్రాయం కూడా కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. పార్టీకి దశాబ్దాలుగా సేవలందిస్తున్న తనకు అధిష్టానం అండగా నిలబడుతుందని ఆశిస్తున్న ధర్మానను, తాజా పరిణామాలు తీవ్ర ఆందోళనకు గురిచేసినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
సీబీఐ చార్జిషీటు నేపథ్యంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన రాజీనామాను ఆమోదించి ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వాలని హైకమాండ్ పెద్దలు తేల్చిచెప్పినట్లు తెలిసింది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో ధర్మాన రాజీనామాను ఆమోదించాల్సిందేనని, లేదంటే ఆశించిన లక్ష్యం నెరవేరదని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డికి మార్గనిర్దేశం చేసినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం.