జగన్మోహనరెడ్డికి అండగా రాష్ట్ర ప్రజలు
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనలో ఉన్న జగన్మోహన రెడ్డికి ప్రజలు అండగా ఉన్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ తెలిపారు. పాత గుంటూరు బస్ స్టాండ్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొన్నూరు, చేబ్రోలు, పెదకాకాని మండలాల కన్వీనర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. నీలం తుపానుతో జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయి ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వ చోద్యం చూస్తోందని విమర్శించారు. పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. దెబ్బతిన్న పత్తిని ప్రభుత్వం సీసీఐ ద్వారా కొనుగోలు చేయాలని కోరినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. దీన్ని బట్టి రైతులపై ప్రభుత్వానికి ఉన్న ప్రేమ తేటతెల్లమవుతోందన్నారు. ఇదే విపత్కర పరిస్థితులలో మహనేత వైయస్ రాజశేఖర్రెడ్డి సీసీఐ మెడలు వంచి పత్తిని కొనుగోలు చేయించారని గుర్తుచేశారు. మహానేత సంక్షేమ కార్యక్రమాలను పాలకులు పూర్తిగా విస్మరించారని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. సభకు అధ్యక్షత వహించిన పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ మాట్లాడుతూ పార్టీని పటిష్టం చేసేందుకు గడపగడపకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీ గుంటూరు నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ కావటి మనోహర నాయుడు, ట్రేడ్ యూనియన్ జిల్లా నాయకుడు గులాం రసూల్ రాష్ట్ర బీసీ మహిళా నాయకురాలు, ప్రముఖ వైద్యులు సజ్జా హేమలత, తదితరులు మాట్లాడారు. అనంతరం పొన్నూరు పట్టణ, మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్లు పఠాన్ బాబూఖాన్, దొప్పలపూడి రాజా, చేబ్రోలు, పెదకాకాని మండలాల కన్వీనర్లు కంకళాల నరసింహారావు, గోళ్ల శ్యాంముఖర్జీతో జిల్లా నాయకులు ప్రమాణం స్వీకారం చేయించారు. తొలుత స్థానిక ఐలాండ్ సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.