రోడ్ మార్గంలో గుంటూరుకి జగన్ పయనం

7 Oct, 2015 11:54 IST

 

హైదరాబాద్) ప్రత్యేక హోదా డిమాండ్ తో నిరవధిక నిరాహార దీక్ష కోసం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ హైదరాబాద్ నుంచి గుంటూరుకు బయలుదేరారు. మొదట విజయవాడలోని కనకదుర్గమ్మ ఆశీస్సులు తీసుకొని అక్కడ నుంచి నేరుగా గుంటూరు వెళతారు.

ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం నుంచి గుంటూరులో చేపట్టనున్న నిరవధిక నిరాహారదీక్షకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సత్తెనపల్లి రోడ్డులోని మిర్చియార్డుకు సమీపంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరం ఏర్పాట్లను  పార్టీ సీనియర్ నేతలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా సాధనకు వైఎస్ జగన్ చేపడుతున్న దీక్షకు రాష్ట్రవాప్తంగా వివిధ వర్గాలు పెద్ద ఎత్తున సంఘీభావం వ్యక్తం చేశాయి. విద్యార్థి, వర్తక, వాణిజ్య, ప్రజా సంఘాలు దీక్షకు సంఘీభావాన్ని ప్రకటించాయి.

విద్యార్థి సంఘాలు కళాశాలల్లో సమావేశాలు నిర్వహించి ప్రత్యేక హోదాపై విద్యార్థులకు అవగాహన కలిగించాయి. కరపత్రాలు పంపిణీ చేశాయి. ఇక పార్టీ శ్రేణులు గ్రామస్థాయి సమావేశాలు నిర్వహించి దీక్ష వద్దకు తరలిరావడానికి ప్రణాళికను రూపొందించుకున్నాయి. ఈ స్పందనకు అనుగుణంగా దీక్షా శిబిరం వద్ద నాయకులు ఏర్పాట్లు చేశారు. గత నెల 26న చేపట్టాలనుకున్న దీక్షకు ప్రభుత్వం ఆటంకాలు కలిగించినప్పటికీ, రెట్టించిన ఉత్సాహంతో పార్టీ నేతలు ఈసారి ఏర్పాట్లు చేశారు.

 దాదాపు 200 మంది నాయకులు ఆసీనులు కావడానికి అనువుగా వేదికను ఏర్పాటు చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, ఇతర సీనియర్ నాయకులు ఈ వేదికపై ఆసీనులవుతారు. దూరం నుంచి కూడా దీక్షా కార్యక్రమాన్ని వీక్షించేందుకు వేదికకు ఇరువైపులా ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. అలాగే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిలు వివిధ సందర్భాల్లో చేసిన ప్రసంగాలను ప్రదర్శించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు