జగన్ బెయిల్ వార్తపై జాతీయ మీడియా ఆసక్తి
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి బెయిల్ అంశం రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయి మీడియాలో కూడా ఆసక్తి రేకెత్తించింది. నాంపల్లి సిబిఐ కోర్టు తీర్పుపై సోమవారం రోజంతా ఒక వైపు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉండగా.. రాష్ట్రం బయట కూడా అంతే ఆసక్తి కనిపించింది. ముఖ్యంగా జాతీయ మీడియా శ్రీ జగన్ బెయిల్ వార్తకు విశేష ప్రాధాన్యం కల్పించింది. టైమ్సు నౌ, ఎన్డీటివి సహా పలు జాతీయ ఛానళ్లు శ్రీ జగన్మోహన్రెడ్డికి బెయిల్ మంజూరైన విషయాన్ని ప్రముఖంగా ప్రసారం చేశాయి.
శ్రీ జగన్మోహన్రెడ్డి బెయిల్పై తీర్పు రావడానికి ముందు నుంచే బ్రేకింగ్సుతో హడావుడి చేసిన జాతీయ మీడియా బెయిల్ వచ్చిన అనంతరం ఆ వార్తకు మరింత ప్రముఖంగా ప్రసారం చేశాయి. కోర్టు తీర్పు సారాంశాన్ని, కోర్టు విధించిన షరతులను పేర్కొంటూనే ఎన్ని నెలలుగా శ్రీ జగన్ జైలు నిర్బంధంలో ఉన్నారనే అంశాలను కూడా అవి వివరించాయి. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రీ జగన్ అభిమానుల సంబరాలను కూడా ప్రత్యక్షంగా ప్రసారం చేశాయి.
శ్రీ జగన్కు బెయిల్ రావడంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆనందాన్ని జాతీయ ఛానళ్లు కూడా ప్రజలతో విశేషంగా పంచుకున్నాయి. జననేత శ్రీ జగన్కు సంబంధించిన అంశానికి జాతీయ మీడియా ప్రాధాన్యం కల్పించడంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, శ్రీ జగన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా... సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో కూడా శ్రీ జగన్ బెయిల్ వార్త విశేషంగా హల్చల్ చేసింది. వేలకొద్దీ షేరింగులు, లక్షల కొద్దీ లైక్లు వెల్లువెత్తాయి. శ్రీ జగన్కు బెయిలొచ్చింది.. ఫేస్బుక్కి పండగొచ్చింది.. సోమవారం సాయంత్రం కోర్టు తీర్పు వెలువడిన కొన్ని క్షణాల్లోనే ఫేస్బుక్లో శ్రీ జగన్ బెయిల్ మంజూరు వార్తను ఎవరికి వారు తామే ఈ విషయాన్ని ముందుగా ప్రకటించాలనే ఆతృతతో ఆనందాన్ని రెట్టింపు చేసుకున్నారు.