జగన్ కోలుకోడానికి మరింత సమయం
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంట్ సభ్యుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి శరీరంలో సోడియం స్థాయి తక్కువగా ఉందని నిమ్సు వైద్యులు చెప్పారు. చక్కెర, రక్తపోటు, కీటోన్సు సాధారణ స్థాయికి చేరుకున్నాయని వారు వెల్లడించారు. ఏడు రోజులుగా దీక్ష చేయడంవల్ల శరీరంలో ఉన్న కొవ్వు పూర్తిగా కరిగిపోయిందనీ, ఈ కారణంగానే కోలుకోవడానికి కొంత సమయం పడుతుందనీ వివరించారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ నీరసంగానే ఉన్నారన్నారు. సాధారణ స్థితికి చేరుకోవాలంటే ఆయన బలమైన ఆహారం తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యం మందకొడిగా ఉన్నందున శ్రీ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కోలుకోవటానికి కొన్నిరోజుల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. ఆయన హెల్తు బులిటెన్ను నిమ్సు వైద్యులు విడుదల చేయలేదు. ఈ వైద్య బృందంలో ప్రముఖులైన డాక్టర్ శేషగిరిరావు (కార్డియాలజీ), డాక్టర్ శ్రీభూషణ్రాజు (నెఫ్రాలజీ), డాక్టర్ వైఎస్ఎన్ రాజు (జనరల్ మెడిసిన్)లు శ్రీ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు.