నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన జననేత
18 Apr, 2016 17:02 IST
విశాఖపట్నంః వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ దీక్ష విరమించారు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కేజీహెచ్ లో గుడివాడ అమర్నాథ్ ను పరామర్శించి...నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
విశాఖకు రైల్వే జోన్ సాధనే లక్ష్యంగా గుడివాడ అమర్నాథ్ నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఐతే, దీక్ష నాలుగవ రోజుకు చేరుకున్న సమయంలో ప్రభుత్వం కుట్రలకు తెరలేపింది. రాత్రివేళ పోలీసులతో బలవంతంగా దీక్ష భగ్నానికి యత్నించి...కేజీహెచ్ కు తరలించారు. ఐతే, అక్కడ కూడా అమర్నాథ్ దీక్షను కొనసాగించారు.
అమర్నాథ్ ను పరామర్శించేందుకు హుటాహుటిన వైఎస్ జగన్ ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి విశాఖ చేరుకున్నారు. ఈసందర్భంగా విశాఖ ఎయిర్ పోర్టు చేరుకున్న జననేతకు పార్టీ శ్రేణులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి పార్టీ నేతలతో కలిసి వైఎస్ జగన్ కేజీహెచ్ ఆస్పత్రికి చేరుకున్నారు. అమర్నాథ్ ఆరోగ్యం గురించి అడిగి తెసుకున్నారు.