- టీడీపీ కక్షసాధింపు రాజకీయాలు
- వైయస్ జగన్ సహా పార్టీ నేతలపై అక్రమ కేసులు
విజయవాడ : ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించిన ప్రతిపక్షంపై చంద్రబాబు సర్కార్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. మానవీయకోణంలో చూడాల్సిన సంఘటనను అమానవీయంగా ప్రవర్తించింది. నిన్న బస్సు ప్రమాద ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన ప్రతిపక్ష నేతను అడ్డుకోవడమే గాకుండా పచ్చనేతలు దూషణలకు దిగారు. అంతటితో ఆగకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష నేతపై అక్రమ కేసు బనాయించింది. ఆస్పత్రి సిబ్బంది విధులుకు ఆటంకం కలిగించారంటూ వైయస్ జగన్ సహా పార్టీ నేతలు పార్థసారధి, ఉదయభాను, జోగి రమేష్, అరుణ్ కుమార్లపై సెక్షన్ 353, 503,34 కింద కేసులు నమోదు చేశారు. రాజకీయ కక్షతోనే టీడీపీ నేతలతో ఫిర్యాదు చేయించి ప్రతిపక్షంపై కేసులు నమోదు చేయిస్తున్నారని వైయస్ఆర్ సీపీ నేతలు వ్యాఖ్యానించారు.
కాగా కృష్ణాజిల్లా నందిగామ మండలం ముండ్లపాడు వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసిన వెంటనే వైయస్ జగన్ హుటాహుటిన హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను వాకబు చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలు, క్షతగాత్రుల ఆక్రందనను చూసి వైయస్ జగన్ చలించిపోయారు. అమాయకుల ప్రాణాలను పొట్టనపెట్టుకున్న టీడీపీ నేతలకు చెందిన ప్రైవేటు ట్రావెల్స్ దుర్మార్గాలపై మండిపడ్డారు. ఇష్టారాజ్యంగా బస్సులు నడుపుతూ ప్రజల ప్రాణాలు బలిగొంటున్న నిందితులపై చర్యలు తీసుకోపోగా వారిని కాపాడేందుకు ప్రభుత్వం యత్నించడంపై వైయస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండానే మూటకట్టేయడం , రహస్యంగా తరలించే ప్రయత్నం చేయడంపై మండిపడ్డారు.