బీజేపీతో వైయస్ఆర్ సీపీ కలిసి పోటీ చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా..
లేకపోతే చంద్రబాబు తప్పుకోవాలని సవాల్
తిరుపతి: చంద్రబాబు కావాలనే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారాలు చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి ధ్వజమెత్తారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి బీజేపీతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసిపోయిందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తిరుపతిలో పార్థసారధి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడికి సవాలు విసిరారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో వైయస్ఆర్ సీపీ కలిసి పోటీ చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, ఒక వేళ కలిసి పోటీ చేయకపోతే చంద్రబాబు తప్పుకుంటారా అని చాలెంజ్ విసిరారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు దుష్ప్రచారాలు చేస్తున్నారని, ఎన్నికల్లో ఒంటిరిగానే బరిలోకి దిగుతామని పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ప్రకటించారని చెప్పారు. చంద్రబాబు ఇప్పటికైనా ప్రజలను ఎలా వంచించాలనే ఆలోచన మానుకొని ప్రజలకు మేలు చేసే విధంగా పరిపాలన చేయాలని సూచించారు.