అనంతపురం: అధికారంలోకి రాగానే అందరికి అండగా ఉంటానని వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లా మారాల గ్రామంలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడారు. ఆయన మాటల్లోనే..
మనకు ఎలాంటి నాయకుడు కావాలి? అబద్ధాలు చెప్పే నాయకుడు కావాలా? మోసం చేసే నాయకుడు కావాలా? నాలుగేళ్ల కాలంలో మనం చూసింది అక్షరాల ఇదే. ఎన్నికల సమయంలో చంద్రబాబు అబద్ధాలు చెప్పి మోసం చేశాడని మనకు అర్థమైంది. ఎన్నికలప్పుడు బ్యాంకుల్లోని బంగారు నగలు ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు. రైతుల పంట రుణాలు పూర్తిగా, బేషరత్తుగా మాఫీ కావాలంటే చంద్రబాబు సీఎం కావాలన్నారు. నాలుగేళ్ల తరువాత అడుగుతున్నాను. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వచ్చిందా?అని అడుగుతున్నాను. ఇవాళ బ్యాంకుల్లో పెట్టిన బంగారం రుణాలు కట్టని దానికి నోటీసులు ఇంటికి వస్తున్నాయి.
– రైతులకు ఏ పంట చూసినా గిట్టుబాటు ధర లేదు. ఇక్కడికి రాకముందు రైతులతో మాట్లాడాను. అన్నా..అసలే కరువు, ఆ తరువాత అకాల వర్షాలతో రైతులకు మిగిలింది కనీసం ఎకరాకు నాలుగు బస్తాల దిగుబడి కూడా రావడం లేదు. బస్తా 44 కేజీలను రూ.1300లకు అడుగుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. పత్తికి గిట్టుబాటు ధర లేదు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు ఎన్నికలప్పుడు ఏమన్నాడు. వైయస్ జగన్ రూ. 3 వేల కోట్లతో ధరల స్థీరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నారు, నేను ఆయన కంటే సీనియర్ అని చెప్పి రూ. 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు. ఇవాళ ఆ నిధి ఎక్కడుందో అర్థం కావడం లేదు. రైతులు పండించిన పంటలకు రేట్లు ఉండటం లేదు. ఆ ధాన్యం షాపులకు వచ్చిన తరువాత రేట్లు పెరుగుతున్నాయి. చంద్రబాబు మన వద్ద కొన్న సరుకులను ప్యాకెట్లలో పెట్టి హెరిటేజ్ షాపులో పెట్టి అమ్ముకుంటున్నారు. ఇంతటి దారుణమైన పరిస్థితులు ఇవాళ వ్యవసాయంలో ఉన్నాయి.
– ఉపాధి హామీకి సంబంధించి దాదాపు 7 నెలలుగా బిల్లులు అందడం లేదు. చంద్రబాబు పుణ్యానా నాలుగు లక్షల మంది బెంగుళూరుకు వెళ్లి సెక్యూరిటీ గార్డులుగాను, ఇతరత్రా పనులు చేస్తున్నారు. నీళ్లు ఇస్తామని డబ్బాలు కొట్టుకుంటున్న చంద్రబాబును ఇవాళ అడుగుతున్నాను. ఇదే జి ల్లాలో 63 మండలాలను ఎందుకు కరువు ప్రాంతాలుగా ప్రకటించావని అడుగుతున్నాను. ఇదే అనంతపురం జిల్లాలో వైయస్ రాజశేఖరరెడ్డి వల్ల హంద్రీనీవా ప్రాజెక్టు అక్షరాల రూ. 6 వేల కోట్లు ఖర్చు చేసి దాదాపు 80 శాతం పనులు పూర్తి చేశారు. చంద్రబాబు చేయాల్సిందేంటంటే..పిల్ల కాల్వలు తవ్వాలి. ఈయన పిల్లకాల్వలు తవ్వకపోవడం వల్ల రైతులు కరువుతో అల్లాడుతున్నారు. పీఏబీఆర్ కాల్వ కింద కూడా పిల్ల కాల్వలు తవ్వడం లేదు. రాయలసీమ జిల్లాల్లో తాగడానికి నీరు లేకపోయినా చంద్రబాబుకు మనసు రావడం లేదు. శ్రీశైలం నిండా నీరు ఉన్నా నీరు ఇవ్వాలన్న ఆలోచన ఈ మనిషికి రావడం లేదు. నాలుగేళ్లుగా ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైతన్నలకు భరోసా ఇచ్చేందుకు ఇదే జిల్లాలో భరోసా యాత్ర చేపట్టాను. రాష్ట్రవ్యాప్తంగా రైతన్నలకు భరోసా కల్పించేందుకు ఇవాళ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టాను.
– అక్కా చెల్లెమ్మలకు తోడుగా నిలిచేందుకు పాదయాత్రను మొదలుపెట్టాను. చదువుకున్న పిల్లోడు ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లాలో అర్థం కాని పరిస్థితిలో పిల్లాడు ఉన్నాడు. ఆ పిల్లలకు తోడుగా ఉండేందుకు పాదయాత్ర కార్యక్రమం చేపట్టాను. మనం అధికారంలోకి వస్తే నవరత్నాలు పథకాలు ప్రవేశపెడతామని ప్రకటించాను. ఇందులో రైతులకు తోడుగా ఉండేందుకు రైతు భరోసా పథకం ప్రకటించాం. ఈ పథకంలో మార్పులు, చేర్పులు ఉంటే సలహాలు ఇవ్వమని మీ అందరిని కోరుతున్నాను. మీ సమస్యలు పరిష్కరించేందుకు ఇవాళ రైతులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చే శాను.
– రైతులకు నాలుగు రకాల ప్రధాన సమస్యలు వస్తాయి. పంటలు వేసే సమయంలో పెట్టుబడులకు డబ్బు లేకపోతే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చంద్రబాబు పుణ్యానా రైతులు బ్యాంకు గడప తొక్కడం లేదు. వ్యాపారుల వద్ద వడ్డీలకు అప్పు చేయాల్సి వస్తుంది. ఈ సమస్యను అధిగమించేందుకు వైయస్ఆర్ బరోసా కార్యక్రమం ప్రకటించాం. జూన్లో రైతులు వ్యవసాయం మొదలుపెడతారు కాబట్టి రైతులకు తోడుగా ఉండేందుకు ప్రతి రైతుకు రూ.12,500 ఇస్తాం. ఇది వరకు 5 ఎకరాల లోపు రైతులకే ఇవ్వాలని అనుకున్నాం. అయితే పాదయాత్రలో రైతుల కష్టాలు లె లుసుకున్నాక అందరికి రూ.12,500 ఇవ్వాలని భావించామన్నారు. ఈ డబ్బు రైతులకు పెట్టుబడులకు ఉపయోగకరంగా ఉంటుంది. పెట్టుబడి తగ్గించేందుకు రైతు భరోసా కింద ప్రతి ఏడాది రూ.12,500 ఇస్తామన్నారు.
– రైతులకు పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ నిరంతరాయంగా ఇస్తామని మాట ఇస్తున్నాను.
– రైతులకు వడ్డీ లేని రుణాలు అందడం లేదు. కారణం ప్రభుత్వం మనకు సంబంధించిన వడ్డీ లెక్కలు బ్యాంకులకు కడితే వారు వడ్డీ లేని రుణాలు ఇస్తారు. చంద్రబాబు ఈ లెక్కలు కట్టకపోవడంతో వడ్డీ లేని రుణాలు అందడం లేదు. ప్రతి రైతుకు కూడా వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చే మూడో కార్యక్రమం చేపడుతామన్నారు.
– రైతులకు గిట్టుబాటు ధర రాక ఎలా అల్లాడిపోతున్నారో మనమంతా చూశాం. చంద్రబాబు పాలనలో ఇది బాగా చూశాం. ప్రతి రైతుకు భరోసా ఇస్తూ అక్షరాల రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెబుతున్నాను. పంట వేసే ముందే ఏ పంట ఎంత ధరకు కొంటామన్నది ముందే ప్రకటిస్తామన్నారు. గిట్టుబాటు ధర కోసం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెబుతున్నాను.
ప్రతి మండలంలో కోల్డు స్టోరేజ్ ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారు.
–. రైతులకు కరువు, అకాల వర్షం వచ్చిన సమయంలో వారిని ఆదుకునేందుకు ప్రకృతి వైఫరీత్యాల నిధి కింద రాష్ట్ర ప్రభుత్వం నిధులు రూ.2 వేల కోట్లు, కేంద్రం నిధులు రూ.2 వేల కోట్లు కలిపి మొత్తం రూ. 4 వేల కోట్లతో ప్రకృతి వైఫరీత్యాల నిధి ఏర్పాటు చేసి రైతులకు తోడుగా ఉంటుంది.
– రైతులకు సాగు నీరు ఇచ్చినప్పుడు వారి ముఖాల్లో చిరునవ్వులు ఉంటాయి. టీడీపీ హయాంలో ఏ సాగునీటి ప్రాజెక్టు కూడా ముందుకు సాగడం లేదు. పోలవరం నుంచి హంద్రీనీవా వరకు ఏ ప్రాజెక్టు పనులు సాగడం లేదు. మనం అధికారంలోకి రాగానే పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపాదికన పూర్తి చేస్తాం. ఇవి కాక మీరేదైనా సలహాలు, సూచనలు ఇస్తే అవన్నీ కూడా వింటాను. ఏదీ సాధ్యమనుకుంటే అది చేస్తానని మాట ఇస్తున్నాను.