ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తారా...?
వైయస్ఆర్ జిల్లా: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి వంద ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తారని ప్రగల్భాలు పలుకుతున్న అధికార పార్టీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్నాయుడు, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి ఒక సవాల్ను స్వీకరించాలని వైయస్ఆర్సీపీ వైయస్ఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం హరిప్రసాద్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీడీపీ అభ్యర్థి ఈ ఎన్నికల్లో ఓడిపోతే ప్రస్తుతం ప్రగల్భాలు పలుకుతున్న నేతలు రాజకీయ సన్యాసం స్వీకరిస్తారా అని ఆయన చాలెంజ్ చేశారు. అధికారం ఉందన్న అండతో అడ్డగోలుగా ఓటర్లను ప్రలోభపెడుతూ విలువలకు పాతరేస్తున్న అధికార పార్టీ నాయకులు అవాకులు, చవాకులు మాట్లాడటం శోచనీయమన్నారు. పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తేనే జిల్లా అభివృద్ధికి సహకరిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మట్లాడటం భావ్యమా అని ప్రశ్నించారు. జిల్లా అభివృద్ధికి పాటుపడాల్సిన అధికార పార్టీ నేతలు వ్యక్తిగత ప్రయోజనాల కోరకు అర్రులు చాస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ పార్టీని ఫిరాయించిన వారు ప్రజా నాయకులు కాలేరని, ప్రజలకు వాస్తవాలు తెలుసునని ఆయన పేర్కొన్నారు.