తూర్పు గోదావరి : దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి 69వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని రాజన్న తనయుడు, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైయస్ జగన్ తన ట్విటర్లో స్పందించారు. తండ్రి వైయస్ఆర్ జయంతి రోజే నేను చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 2500 కిలోమీటర్ల అరుదైన మైలురాయిని చేరుకోనుండటం కేవలం యాధృచ్ఛికమే కాదు, ఏపీ ప్రజలతో పాటు వైయస్ఆర్ ఆశీస్సులు కూడా నాకు ప్రతిబింబించేలా ఉంది. స్వర్గం నుంచి నాన్న వైయస్ఆర్ ఆశీర్వదించారు. హ్యాపీ బర్త్డే నాన్న. ఎల్లప్పుడూ మాకు అండగా ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు’ అని వైయస్ జగన్ ఉద్వేగభరితంగా ట్వీట్ చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రతిపక్షనేత వైయస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఇవాళ ఉదయం 208వ రోజు ప్రారంభమైంది. అశేష జనవాహిని తరలిరాగా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల మధ్య వైయస్ జగన్ తన పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు.