కర్నూలు: తెలుగు జాతి గౌరవాన్ని చంద్రబాబు ఢిల్లీలో తాకట్టుపెట్టారని కర్నూలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త హఫీజ్ఖాన్ విమర్శించారు. కర్నూలు జిల్లా కేంద్రంలో హఫీజ్ఖాన్ ఆధ్వర్యంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఏపీ బంద్లో పాల్గొన్నారు. ప్రత్యేక హోదా మా హక్కు అంటూ.. హోదాను నీరుగారుస్తున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో గత నాలుగేళ్లుగా హోదా కోసం అనేక పోరాటాలు చేశామన్నారు. ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి లేని చంద్రబాబు పోలీసులతో ఉద్యమాన్ని అణచివేసేందుకు కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షల కోసం వైయస్ఆర్ సీపీ పోరాడుతుందని, అందుకు ప్రజా సంఘాలు, కార్మికులు, యువత స్వచ్ఛందంగా తరలివచ్చి బంద్లో పాల్గొంటున్నారన్నారు. ఇప్పటికైనా ప్రజల డిమాండ్ను నరేంద్రమోడీ, చంద్రబాబు అర్థం చేసుకోవాలన్నారు.