తూర్పు గోదావరి: చంద్రబాబునాయుడు ప్రభుత్వ విధానాలను తూర్పారబడుతూ తాను అధికారంలోకి వస్తే వివిధ వర్గాల వారికి అమలు చేసే ‘నవరత్నాల’ను వివరిస్తూ గతేడాది నవంబర్ 6వ తేదీన వైయస్ జగన్ ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఇంతవరకు నాలుగు రాయలసీమ జిల్లాలతో పాటు కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పాదయాత్రను పూర్తి చేసిన వైయస్ జగన్ ఈరోజు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని అడుగుపెట్టారు. వైయస్ జగన్ రాక కోసం వేయి కళ్ళతో ఎదురుచూసిన పార్టీ శ్రేణులు, అభిమానులు జయ జయ ధ్వనాలు, హర్షధ్వనాల మధ్య కొవ్వాడ వద్ద వైయస్ జగన్కు ఘన స్వాగతం పలికారు. జగన్కు స్వాగతం పలుకుతూ 65 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. పార్టీ జెండాలు ఏర్పాటు చేయడంతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకోవడంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. డప్పు వాయిద్యాలతో, బాణాసంచ కాల్పులతో పార్టీ శ్రేణులు వైయస్ జగన్కు ఘన స్వాగతం పలికారు. భారీ ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాలు కట్టడంతో పాటు అక్కడకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం తలపించేలా కనిపించింది.