సాగునీటిని తీసుకురావడంలో ప్రభుత్వం విఫలం
అనంతపురం(కూడేరు): వివిధ జలాశయాల నుంచి అనంతపురం జిల్లాకు కేటాయింపు మేరకు సాగునీటిని తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. సోమవారం కూడేరు తహశీల్దార్ కార్యాలయం ముందు జలసాధన సమితి ఆధ్వర్యంలో సాగు నీటి కోసం సత్యాగ్రహాన్ని చేపట్టింది. ఈ దీక్షకు వైయస్ఆర్సీపీ మండల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సంధర్భంగా వైయస్ఆర్సీపీ నాయకుడు శశికాంత్ రెడ్డి మాట్లాడారు. రాయలసీమకు 400 టీఎంసీలు , అనంతపురానికి 100 టీఎంసీల నిఖర జలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. హంద్రీ నీవా కాలువను 2017నాటికి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి 40 టీఎంసీల నిఖర జలాలు కేటాయించి చట్టబద్దత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. హంద్రీ నీవాకు నీరు వస్తే జిల్లాలో లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. కాని నిర్మాణం పూర్తి చేసే విషయంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందన్నారు. మండలంలో పశుమేత కేంద్రాలు ఏర్ఫాటు చేసి పశువుకుల ఉచితంగా గడ్డిని పంపిణీ చేయాలన్నారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘం నాయకులు అశ్వర్థమ్మ, నారాయణ, ముత్యాలన్న, వైయస్ఆర్ సీపీ నాయకులు శశికాంత్ రెడ్డి, తిరుపతయ్య, వేణుగోపాల్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.