నవరత్నాలతో ఏపీకి మంచిరోజులు

29 Aug, 2017 12:30 IST
  • ఈ నెల 31న నెల్లూరు రూరల్‌ లో నవరత్నాల సభ
  • పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపు
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
నెల్లూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలతో ఆంధ్రప్రదేశ్‌కు మంచి రోజులు రానున్నాయని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. 2019 ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి రానుందన్నారు. నెల్లూరు రూరల్‌ వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో నవరత్నాల సభలను నిర్వహిస్తున్నామన్నారు. తరువాత గ్రామ స్థాయి సభలను నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, అధికారంలోకి వస్తే వైయస్‌ఆర్‌ సీపీ చేయబోయే కార్యక్రమాలపై సభలో చర్చిస్తామన్నారు. అనంతరం వైయస్‌ జగన్‌ పాదయాత్ర ఉంటుందన్నారు. 

నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ నవరత్నాల సభను ఈ నెల 31వ తేదీన జీపీఆర్‌ కల్యాణ మండపంలో నిర్వహిస్తున్నామని కోటంరెడ్డి తెలిపారు. ఉదయం 11 గంటలకు నిర్వహించే ఈ సభకు ముఖ్య అతిథులుగా ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయ్‌కుమార్‌రెడ్డిలు పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా సభకు సంబంధించిన కరపత్రాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. నవరత్నాల సభకు నియోజకవర్గ పరిధిలోని వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.