ఎదురుదాడికి దిగి తొడలు కొడుతున్నారు

23 Mar, 2017 16:12 IST

వెలగపూడి: అధికార పార్టీ చాలెంజ్‌కు సిద్ధం అని చెప్పడానికి కూడా  ప్రతిపక్షానికి మైక్‌ ఇవ్వడం లేదని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులపై ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ మాట్లాడుతుంటే టీడీపీ సభ్యులు ఎదురుదాడికి దిగి తొడలు కొడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లి అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యలపై మాట్లాడేందుకు మాకు అవకాశం ఇవ్వండి అని అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బాధితులపై చర్చించి తరువాత చాలెంజ్‌ విషయం చెబుతామని అంటే మైక్‌ ఇవ్వకుండా అధికార పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అగ్రిగోల్డ్‌ బాధితులపై సభలో చర్చ జరుగుతుంటే స్పీకర్‌ తనకు ఎప్పుడో అవమానం జరిగిందని ఇప్పుడు ప్లే చేస్తాననడం సమంజసమా అని ప్రశ్నించారు. అంతగా స్పీకర్‌ మనోభావాలు దెబ్బతినివుంటే అగ్రిగోల్డ్‌ సమస్యలపై చర్చ ముగిసిన తరువాత ఎందుకు టేకప్‌ చేసుకోలేకపోయారని ప్రశ్నించారు. చంద్రబాబు సర్కార్‌ తీరు సమస్యలను తప్పుదోవపట్టించే ఉద్దేశ్యమా కాదా అనేది ప్రజలు ఆలోచించాలని సూచించారు.