సమైక్య శంఖారావం సభకు 4 ప్రత్యేక రైళ్లు
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్తో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 26న హైదరాబాద్ లో నిర్వహిస్తున్న 'సమైక్య శంఖారావం' బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో జనం తరలివచ్చేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటి వరకూ ఒక్క ఉత్తరాంధ్ర మూడు జిల్లాల నుంచే నాలుగు ప్రత్యేక రైళ్లను సిద్దం చేసినట్టు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుజయ్ కృష్ణ రంగారావు తెలిపారు. పార్టీకి చెందిన ఉత్తరాంధ్ర నాయకులు శుక్రవారం సమావేశమై సమైక్య శంఖారావం సభ ఏర్పాట్లను సమీక్షించారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో ఆ సభకు వెళ్లనున్నట్టు రంగారావు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అన్ని ప్రాంతాల నుంచి హైదరాబాద్ వెళ్లడానికి రవాణా సదుపాయాలు కల్పించనున్నట్టు చెప్పారు. సమైక్య శంఖారావం సభకు హాజరయ్యే అభిమానులు, పార్టీ శ్రేణుల కోసం మరిన్ని రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు సుజయ్ కృష్ణ రంగారావు తెలిపారు.