నేతల ఒత్తిడికి బలైతున్న ఉద్యోగులు
8 Apr, 2017 12:34 IST
అనంతపురం: అధికార పార్టీ నేతల ఒత్తిడులకు చిన్న చిన్న ఉద్యోగులు బలైపోతున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తూ వారికి లబ్దిచేకూరే పనులు చేయించుకుంటున్నారని మండిపడ్డారు. ఉరవకొండ ఎమ్మార్వో ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న రామలింగం అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఎమ్మెల్యే ఆసుపత్రికి చేరుకొని మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రామలింగం ఆత్మహత్యపై నిస్పక్షపాతంగా విచారణ జరగాలని డిమాండ్ చేశారు. పోస్టుమార్టం కూడా కరెక్ట్గా జరిపించాలన్నారు. మృతుడి సెల్ఫోన్ మేసేజ్ ఆధారంగా గోవింద్ అనే వ్యక్తి ఎవరూ. ఆత్మహత్యకు గోవింద్కు ఉన్న లింక్ ఏంటని ప్రశ్నించారు. రామలింగంతో తప్పు చేయించిన పెద్దవారెవరో పోలీసులు బయటపెట్టాలని కోరారు. కింది స్థాయి ఉద్యోగులను టీడీపీ నేతలు ఎందుకు ఒత్తిడులకు గురిచేస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని విశ్వేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు.