కర్నూలుః యువభేరికి తరలివచ్చిన ప్రతి చెల్లెమ్మకు, సోదరుడికి, పెద్దలకు, జిల్లా, రాష్ట్ర, నగర యువ నాయకులకు పేరుపేరునా అభినందనలు. ప్రత్యేక హోదా అవసరాలు, చేకూరే ప్రయోజనాలు అందరికీ తెలుసు. ఇప్పటికే పలుమార్లు అవగాహన కల్పించాం. ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన తర్వాతే రాష్ట్రాన్ని విడగొట్టారు. ఆ రోజు అందరు నాయకులు హోదా కావాలన్నారు. హైదరాబాద్ లాంటి నగరం మనకు లేకుండా పోయింది. నిరుద్యోగులు సరాసరి వెళ్లేది హైదరాబాద్కే. సాఫ్ట్వేర్, ఇతర పరిశ్రమలు హైదరాబాద్ చుట్టుపక్కలే ఉన్నాయి. అందుకే ప్రత్యేకహోదా కోసం నిరంతరం పోరాటం చేస్తున్నామని వైయస్ జగన్ స్పష్టం చేశారు.
ప్రత్యేక హోదా వస్తే ప్రతి జిల్లా హైదరాబాద్ అవుతుంది. నరేంద్రమోదీ పక్కనే పెట్టుకుని ఆ రోజు పదేళ్లు కావాలని, పదిహేనేళ్లు కావాలన్నవారు ఇప్పుడు ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నట్టు. ఇప్పుడేమో ప్రత్యేక హోదాకు ఉద్యోగాలకు, పారిశ్రామిక రాయితీలకు సంబంధం లేదంటూ కొత్త పల్లవి అందుకోవడం మన దౌర్భాగ్యం. హోదాపై చంద్రబాబు పూటకో మాట, రోజుకో వేషం వేసిన సందర్భాన్ని ఎల్ఈడీ స్క్రీన్ మీద వీడియోలో చూపించారు. ఇలాంటి మోసాలు చేసే వారిని మనం ప్రశ్నించాలి. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ సాధించుకునేందుకు అందరం కలిసి కట్టుగా పోరాడుదాం. ప్రత్యేక హోదాను సాధించుకుందామని వైయస్ జగన్ పిలుపునిచ్చారు.