ధర్మపోరాటంలో జగన్‌ వెంటే ఉంటాం: గడికోట

6 Oct, 2012 10:58 IST
కడప, 6 అక్టోబర్‌ 2012: ధర్మపోరాటంలో తామంతా కలిసి వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి వెంటే నడుస్తామని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి స్సష్టం చేశారు. జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌ విషయంలో నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తమను చాలా నిరాశకు గురిచేసిందని అన్నారు. కడపలో ఆయన శనివారంనాడు మీడియాతో మాట్లాడారు. న్యాయస్థానం ఇచ్చిన గడువులోగా కౌంటర్‌ దాఖలు చేయని సిబిఐని కోర్టు ప్రశ్నించకపోవడం బాధాకరమని శ్రీకాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజల కోసం జగన్మోహన్‌రెడ్డి త్వరలోనే కడిగిన ముత్యంలో బయటికి వస్తారన్న ధీమాను అయన వ్యక్తం చేశారు. 

రాజశేఖరెడ్డి అమలు చేసిన ఆరోగ్యశ్రీ, ఫిజు రీయింబర్సుమెంటు లాంటి సంక్షేమ పథకాన్నీ యధావిధిగా అమలు చేయాయని బయటికి వచ్చినందుకు జగన్మోహన్‌రెడ్డికి విధించిన శిక్ష ఇది అన్నారు. అయినా జగన్‌ ధైర్యం కోల్పోలేదన్నారు. జైలు నుంచి కూడా జగన్‌ ఇదే సందేశాన్ని పంపించారు. ధైర్యంగా ఉండాలన్నారు. పోరాటం చేసేవాళ్ళను ఈ విధంగా హింసిస్తున్నారని, అయినా మనకు మంచి సమయం వస్తుందని ఆయన ధైర్యంగా సందేశం పంపించారన్నారు. కార్యకర్తలందరూ ఆ సందేశాన్ని స్వీకరించి ధైర్యంగా ముందుకు పోదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇటువంటి ఇబ్బందులన్నింటికీ ఎదురొడ్డి నిలబడదామని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. వాళ్ళెంతకాలం ఇలా చేస్తారో చూద్దామన్నారు. గతంలో భారతదేశానికి స్వాతంత్ర్యం తేవడానకి కూడా మన పెద్దలందరూ ఇదే విధంగా కష్టాలు పడిన విషయాన్ని శ్రీకాంత్‌రెడ్డి గుర్తు చేశారు. అప్పుడున్న బ్రిటిష్‌ ప్రభుత్వం పెద్ద పెద్ద నాయకులందరినీ జైళ్ళ పాలు చేశారన్నారు. అక్రమమైన కేసులు వారిపై పెట్టారన్నారు. దుర్మార్గపు బ్రిటిష్‌ ప్రభుత్వం పోయిందంనుకుంటే ఇప్పుడు ఇటలీ ప్రభుత్వం వచ్చిందని శ్రీకాంత్‌రెడ్డి దుయ్యబట్టారు.

రాబర్టు వాద్రాపైన నిన్న కేజ్రివాల్‌ ఆరోపణలు చేశారు. వాటిపై విచారణ చేయించాలనో ఇంకో విధమైన చిత్తశుద్ధో లేకుండా, నాయకులందరికీ ఖండనలు ఇవ్వాంటూ మెసేజ్‌లు పంపించడమే కాకుండా న్యాయపరమైన చర్యలు తీసుకుందామని హెచ్చరించడంలో అర్థమేమిటో తెలుస్తోందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ప్రజా బలం లేదన్నారు. కేవలం వాళ్ళకు ఉన్న బలం సిబిఐ, ఈడీ అని ఎద్దేవా చేశారు. ఇలాంటి దర్యాప్తు సంస్థలను వాళ్ళ చేతిలో పెట్టుకొని అందరినీ భయభ్రాంతులకు గురిచేయాలని చూడడం దుష్ట సాంప్రదాయమని, ప్రజాస్వామ్యంలో ఇది తగదన్నారు.

ప్రజలకు మేలు కోసం జగన్‌ నిర్ణయం తీసుకున్నారని, ధర్మ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. జగన్‌కు ప్రజాబలం ఉందని తెలిసి, ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఆదరిస్తున్నారని, ఉప ఎన్నికల్లోను, ఇతర ఎన్నికల్లో ఆయనకు అఖండ మెజారిటీ ఇస్తున్నారని, ఇతనిని ఏదో విధంగా అణగదొక్కాలని టిడిపి, కాంగ్రెస్‌పార్టీలు కుట్రలు చేస్తున్నాయని నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు చీకటి రాజకీయాలు చేస్తున్నారని, అంతకు ముందు హోంమంత్రిగా చిదంబరం ఉన్నప్పుడు చీకట్లో కలిశారు. మళ్ళీ ఆర్థిక మంత్రి అయ్యాక తన ఎంపీలను పంపించి, పాదయాత్ర నుంచి ఫోన్‌ మాట్లాడి జగన్‌కు ఏదో విధంగా బెయిలు రాకుండా చెయ్యండని కోరడం చూస్తే వీరంతా కచ్చితంగా కుమ్మక్కయ్యారన్నది స్పష్టం అవుతోందన్నారు. 

వీరికి నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే జగన్‌ బయటికి వచ్చాక జనంలోకి వెళతారని, వీళ్ళు జనంలోకి వెళ్ళాలని, ప్రజలు ఇచ్చే తీర్పును ఛాలెంజ్‌గా స్వీకరించాలన్నారు. ఆ ప్రజా తీర్పుకు విలువ ఇద్దామని సవాల్‌చేశారు. మహానేత వైయస్‌ నాయకత్వంలో తామంతా ఇలాంటి సవాళ్ళను దీటుగా ఎదుర్కొంటామన్నారు. ప్రజల కోసమే తామంతా పనిచేస్తామన్నారు.