వంగవీటి రంగా విగ్రహం ధ్వంసం
15 Jan, 2017 19:20 IST
విజయవాడ : నగరంలోని సింగ్ నగర్లో ఏర్పాటు చేసిన వంగవీటి రంగా విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో ఆ ప్రాంతంలో ఆదివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సింగ్ నగర్ నడిబొడ్డున ఏర్పాటు చేసిన వంగవీటి రంగా విగ్రహం ధ్వంసమై ఉండడాన్ని స్థానికులు ఈ రోజు ఉదయం కనుగొన్నారు. ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో రంగా అభిమానులు పెద్దఎత్తున అక్కడకు చేరుకుని ధర్నాకు దిగారు. రంగా విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని, రంగా విగ్రహాన్ని యథావిధిగా ప్రతిష్టించాలని వారు డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులకు నచ్చచెప్పారు. విగ్రహాన్ని కూల్చిన దుండగులను కనిపెట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు.