ప్రజాస్వామ్యం బతికి ఉందా?
27 Mar, 2017 15:15 IST
టీడీపీ నేతలు తప్పు చేస్తే సీఎం సెటిల్మెంట్
మీడియాతో వైయస్ జగన్ చిట్చాట్
ఏపీ అసెంబ్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం బతికి ఉందా అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రవాణా శాఖ కమిషనర్పై టీడీపీ ప్రజాప్రతినిధులు దాడి చేస్తే..దాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. సోమవారం అసెంబ్లీ వాయిదా అనంతరం వైయస్ జగన్ మీడియా చిట్చాట్లో మాట్లాడారు. విజయవాడ ఆర్టీఏ అంశం, నందిగామ ఆసుపత్రి ఘటనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు. రవాణా శాఖ కమిషనర్పై దాడికి సంబంధించి ప్రతిపక్ష ఎమ్మెల్యే ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అని నిలదీశారు. చట్టం తన పని తాను చేయకుండా సీఎం అడ్డు తగలడం భావ్యమేనా? అని ప్రశ్నించారు. గన్మన్ను గట్టిగా తోసేశారు.. మరి వాళ్లకు క్షమాపణలు చెప్పరా? అన్నారు. శాంతిభద్రతలు కాపాడుతున్నామని చెప్పుకోవాలంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలిని సూచించారు. ఒక ప్రైవేట్ వ్యవహారం కోసం టీడీపీ నేతలు ఆర్టీఏ కార్యాయానికి వెళ్లారని తెలిపారు. ప్రజాహితం కోసం టీడీపీ నేతలు ఆర్టీఏ కార్యాలయానికి రాలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో వారిపై చర్యలు తీసుకోకుండా, సీఎం సెటిల్మెంట్ చేసి అధికారులను నిస్సహాయ స్థితికి నెట్టడం సరైందేనా? అని వైయస్ జగన్ నిలదీశారు. సభ జరుగుతుండగా ఒక ఎమ్మెల్యేను అక్రమంగా నిర్భందించారు. చెవిరెడ్డిని అరెస్టు చేసి ఇంకా విడుదల చేయలేదు. దీనిపై అడగడానికి ప్రయత్నిస్తే సభలో మైక్ ఇవ్వలేదని వైయస్ జగన్ వ్యాఖ్యానించారు. ప్రజల కోసం పోరాడితే ప్రతిపక్ష నేతలపై దొంగ కేసులు పెడుతున్నారని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికి ఉందా అని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో వనజాక్షి విషయంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనిని వెనకేసుకొచ్చి రాజీ చేశారని విమర్శించారు. వీళ్ల మనషులు తప్పు చేస్తే రాజీలు, సెటిల్మెంట్లు. చెవిరెడ్డిని బయటకు కూడా కనిపించనీయడం నిర్భందించడం దారుణమని మండిపడ్డారు. చెవిరెడ్డి విషయంలో స్పీకర్ ఎందుకు పట్టించుకోవడం లేదు. సభాపరంగా రక్షణ ఉన్నా ఎమ్మెల్యేను ఎందుకు అరెస్టు చేశారని వైయస్ జగన్ ప్రశ్నించారు.