ఏపీ అసెంబ్లీ: ప్రజా సమస్యలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభలో పోరాటం చేస్తుంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో విమర్శలు చేయించడం దారుణమని ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో లక్షలాదిమంది విద్యార్థులకు సంబంధించిన పేపర్ లీకేజ్ సమస్యపై తాము సభలో వాయిదా తీర్మానం ఇస్తే..స్పీకర్ చర్చకు అంగీకరించకుండా ఫిరాయింపు ఎమ్మెల్యే వెంకటరమణకు మైక్ ఇచ్చి మమ్మల్ని తిట్టించడం సరికాదన్నారు. మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావు ప్రమేయంతోనే పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ అయ్యిందన్నారు. ఇది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన సమస్య కాబట్టి మంత్రులను భర్తరఫ్ చేయాలని పిన్నెళ్లి డిమాండ్ చేశారు.