'డీజిల్'పై వైయస్ఆర్ సిపి వాయిదా తీర్మానం
20 Sep, 2012 03:59 IST
హైదరాబాద్, 20 సెప్టెంబర్ 2012: డీజిల్ ధర పెంపుపైన, వంట గ్యాస్ సిలిండర్లపై పరిమితి విధించడంపైన, దేశంలోని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం ద్వారాలు తెరవడంపైన (ఎఫ్డీఐలు) వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురువారంనాడు శాసనసభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. ఇవే అంశాలపైన టీడీపీ, సీపీఎం, సీపీఐ, బీజేపీ కూడా వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. శాసనసభ సమావేశాల మూడవ రోజు గురువారం కూడా ప్రతిపక్షాలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. మైనార్టీ సబ్ప్లాన్పై ఎంఐఎం, తెలంగాణ అంశంపై టీఆర్ఎస్, విద్యుత్ సమస్యలపై నాగం జనార్దన్రెడ్డి వాయిదా తీర్మానం
ప్రవేశపెట్టారు. అయితే, విపక్షాల వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు.
తాము ప్రవేశపెట్టిన తీర్మానాలపై చర్చకు అనుమతించాల్సిందే అంటూ ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. సభలో తీవ్ర గందరగోళం చోటుచేసుకోవడంతో సభను స్పీకర్ గంటపాటు వాయిదా వేశారు.