రాష్ట్రాన్ని విఛిన్నం చేస్తున్న కాంగ్రెస్, టీడీపీ
కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇచ్చిన టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు సమైక్య ఉద్యమం చేసే అర్హత లేదని స్పష్టంచేశారు. సమైక్య ఉద్యమాన్ని పోలీసులతో అణిచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వై. విశ్వేశ్వరరెడ్డి, తోపుదుర్తి కవిత, శంకర నారాయణ చెప్పారు. రాయలసీమను విభజిస్తే ఊరుకునేది లేదని కుండబద్దలు కొట్టారు. శ్రీ జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీసేందుకు టీడీపీ, కాంగ్రెస్ డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు. హైదరాబాద్ కేసీఆర్ తండ్రి జాగీరు కాదనీ, సమైక్యాంధ్రులదేననీ వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి స్పష్టంచేశారు. రాష్ట్రాన్ని విభజిస్తే కాంగ్రెస్కు పుట్టగతులుండవని హెచ్చరించారు. రాజంపేటలో సమైక్యాంధ్రకు మద్దతుగా దీక్షలు చేస్తున్న జేఏసీ నాయకులకు మద్దతు తెలిపిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. రాష్ట్ర విభజనకు నిరసనగా రాజంపేటలో మున్సిపల్ కార్మికులు ఉపాధ్యాయులు, అంగన్వాడి మహిళలు ఐక్య కళాకారుల యూనియన్ ధర్నా, ర్యాలీ నిర్వహించారు.