నగరి ప్రజలపై జిల్లా కలెక్టర్ వివక్ష
నగరి నియోజకవర్గంపై జిల్లా కలెక్టర్ వివక్ష చూపుతున్నారని ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. గురువారం చైర్పర్సన్ కె.శాంతి అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ హాలులో నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. వేసవిలో తాగునీటి సమస్య తీర్చడానికి ప్రతి మున్సిపాలిటీకి నిధులు విడుదలయ్యాయని. జిల్లాలో అన్ని మున్సిపాలిటీలకు అనుమతిచ్చిన కలెక్టర్ నగరి మున్సిపాలిటీకి అనుమతి ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. దీనికి ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు సమీపంగా ఉన్న అడవికొత్తూరు చెరువునుంచి 230 మీటర్ల మేరకు ట్రెంచ్ కొడితే నీరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు చేరుతుందని వేసవి ముగిసే వరకు తాగునీటి సమస్య ఉండదని దీనికి 5 లక్షలు ఖర్చవుతుందని ఆమె చెప్పారు. అయితే ఈ అంశాన్ని గత సమావేశంలో సూచించినా అధికారులు ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదన్నారు. కౌన్సిల్ ఆమోదం పొందిన అంశాలు ఆచరణకు నోచుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంత మైదానంలో షాపింగ్ కాంప్లెక్ నిర్మాణానికి గతంలోనే ప్రణాళికలు సిద్ధం చేసినా ఇప్పటివరకు ఆచరణకు నోచుకోలేదన్నారు. అధికారుల అసమర్ధతతోనే అభివృద్ధి కుంటుపడుతోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఎస్ఎల్లో నగరి మున్సిపాలిటీ వెనకబడిందని దీనికి కమీషనర్ సమాధానం చెప్పాలన్నారు. సమావేశంలో మేనేజర్ శేఖర్, టీపీబీవో షణ్ముగం, శానిటరీ ఇన్స్పెక్టర్ మోతీలాల్, ఏపీవో రమణారెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.