రెండు నాల్కల చంద్రబాబు: భూమన
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్ర విభజనపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని చంద్రబాబు నాయుడు కలవడాన్ని భూమన తప్పుపట్టారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఢిల్లీ పర్యటన చేయడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. అది చంద్రబాబు నాయుడి రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డికి బెయిల్ రానివ్వకుండా అడ్డుకునేందుకు చంద్రబాబు న్యూఢిల్లీలో చీకటి రాజకీయాలు చేస్తున్నారని భూమన ఆరోపించారు.
ఆదివారం నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరవధికంగా సమైక్యాంధ్ర ఉద్యమాలు నిర్వహిస్తున్నట్లు కరుణాకరరెడ్డి వివరించారు. సమైక్య ఉద్యమం మరో సంవత్సరం పైబడి జరిగినా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుకంజ వేసే ప్రసక్తే లేదని భూమన వెల్లడించారు. చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం ఉదయం న్యూఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే.