జగన్కు బెయిల్ రాకుండా యత్నించిన బాబు
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డికి బెయిల్ రానివ్వకుండా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అడ్డుకునే ప్రయత్నం చేశారని పార్టీ ఎమ్మెల్యేలు జి.శ్రీకాంత్రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఆరోపించారు. శ్రీ వైయస్ జగన్ చంచల్గూడ జైలు నుంచి మంగళవారం బెయిల్పై విడుదలవుతున్న నేపథ్యంలో మంగళవారం వారు హైదరాబాద్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిన్నటి వరకు కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐని చంద్రబాబు భుజాన మోశారని, అలాంటిది శ్రీ జగన్కు బెయిల్ రాగానే ఆ సంస్థను దూషించడం మొదలుపెట్టారని ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు గుర్తు చేశారు.
తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తేవాలని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన టిడిపి ప్రజాప్రతినిధులకు శ్రీకాంత్రెడ్డి, ప్రసన్నకుమార్రెడ్డి సూచించారు. మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అభీష్టం ప్రకారం రాష్ట్రం సమైక్యంగా ఉండాలని వారు తెలిపారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని ప్రాంతాలూ సమానమే అని వారు అన్నారు. ప్రజల సమస్యలపై చిత్తశుద్ధితో పోరాడే నాయకుడు కావాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారని తెలిపారు. కోర్టు అనుమతితో శ్రీ వైయస్ జగన్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తప్పకుండా పర్యటిస్తారని శ్రీకాంత్రెడ్డి, ప్రన్నకుమార్రెడ్డి చెప్పారు.