రాజానామా చేస్తేనే సీమాంధ్రలో బాబుకు స్థానం
రాష్ట్రం సమైక్యంగా ఉండాలని సీమాంధ్ర ప్రాంత టిడిపి నాయకులు నిజంగానే కోరుకుంటుంటే తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడితో వెంటనే రాజీనామా చేయించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు జోగి రమేష్ డిమాండ్ చేశారు. ఆ తరువాతే సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని వారికి జోగి రమేష్ సూచించారు. ఆదివారంనాడు ఆయన విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు సమైక్యాంధ్రకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్న తర్వాతే సీమాంధ్ర ప్రాంతంలో అడుగుపెట్టాలని రమేష్ సూచించారు. అప్పటి వరకు సీమాంధ్రలో అడుగుపెట్టే అర్హత చంద్రబాబుకు లేదని ఆయన స్పష్టం చేశారు.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల పర్వవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని జోగి రమేష్ తెలిపారు. దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలను రమేష్ ఈ సందర్భంగా ఖండించారు.