తిరుపతి : మన రాష్ట్రం ముక్కలు కావడానికి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు శల్య సారథ్యం వహించారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. నిజానికి ఈ విభజనకు తెర వెనుక ప్రధాన పాత్ర పోషించిన కపట నాటక సూత్రధారి చంద్రబాబు నాయుడే అని ఆయన నిప్పులు చెరిగారు. తిరుపతిలో ఆయన సోమవారంనాడు మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర ప్రజల నుంచి వెల్లువెత్తున్న ఆగ్రహావేశాలను ప్రత్యక్షంగా చూసిన టిడిపి, కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు రాజీనామా నాటకాలు ఆడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. సీమాంధ్ర, తెలంగా ఇరు ప్రాంతాల వారికి సమాన న్యాయం చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సూచనను సోనియా తుంగలో తొక్కారని భూమన ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడం ద్వారా శ్రీ జగన్మోహన్రెడ్డి ప్రాబల్యాన్ని తగ్గించాలని కాంగ్రెస్, టిడిపి నాయకులు తాపత్రయ పడుతున్నారని భూమన కరుణాకరరెడ్డి అన్నారు. అయితే ఈ విషయంలో ప్రజలు వారి ఆటలు సాగనివ్వబోరని, వారి డ్రామాలను సహించబోరని ఆయన హెచ్చరించారు.