చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
ఎల్.ఎన్.పేట (శ్రీకాకుళం): ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో చంద్రబాబు పూర్తిగా వైఫల్యం చెందారని, బాబు మోసకారి పరిపాలన గురించి ప్రతి వ్యక్తికి తెలియజేయాల్సిన బాధ్యత వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరిపైన ఉందని ఆపార్టీ జిల్లా నాయకురాలు రెడ్డి శాంతి అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం పార్టీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈనెల 9వ తేదీన పాతపట్నం నియోజక వర్గం కేంద్రంలో నవరత్నాల సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈసభకు అధిక సంఖ్యలో హాజరు కావాలన్నారు. చంద్రబాబు వైఫల్యాలతో పాటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైయస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే అన్ని వర్గాల వారికోసం అమల్లోకి తీసుకురానున్న సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. ఓట్లు వేయించుకునేందుకు రూ.కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు 2019లో జరిగే సాధారణ ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ది చెపుతారని చెప్పారు. వైయస్ఆర్ కుటుంబంలో అందరు చేరేలా అవగాహన కలిగించాలన్నారు. ఆమెతో పాటు పార్టీ కన్వినర్ కిలారి త్రినాథ్, పార్టీ నాయకులు పెనుమజ్జి విష్ణు, లోచర్ల మల్లేశ్వరరావు, ఎర్ర జనార్థన్, కొల్ల కృష్ణ, తూలుగు కృష్ణ, బుడుమూరు బానుచంద్ర, గుజ్జల యోగేశ్వరరావు, మూకళ్ల అప్పారావు, రాంనాథ్ పాణిగ్రహి తదితరులు పాల్గొన్నారు.