- రేవంత్రెడ్డి బయటపెట్టిన విషయాలపై సమాధానం చెప్పాలి
- ఓటుకు కోట్లు కేసు విచారణ ఎదుర్కొనే దమ్ము చంద్రబాబుకు ఉందా
- దేవినేనికి మతిస్థిమితం సరిగ్గా లేదు
- భారీ నీటి పారదల శాఖ భారీ అవినీతి శాఖగా మారింది
- వైయస్ఆర్ సీపీ ప్రశ్నలపై టీడీపీ సమాధానం చెప్పాలి
- వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్
విజయవాడ: చంద్రబాబు విదేశీ పర్యటనలు వ్యక్తిగత పనులకు తప్ప రాష్ట్రానికి ఎలాంటి లబ్ధి చేకూరదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఏ దేశానికి వెళ్తే ఆ దేశం లాంటి రాజధాని కడతానని చెప్పిన మాటలు వాస్తవమా కాదా...అని ప్రశ్నించారు. చంద్రబాబు మోసాలపై వెల్లంపల్లి విరుచుకుపడ్డారు. విజయవాడలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రతిపక్ష వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటపెడుతుంటే టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు. అమెరికా వెళ్లినప్పుడు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లను కలిశాం, అమరావతికి మైక్రోసాఫ్ట్ వస్తుందని చంద్రబాబు చెప్పిన 12 గంటలలోపే సత్య నాదెళ్ల అవాస్తవమని కొట్టిపారేశాన్నారు. 40 నెలల్లో నెలకో దేశం తిరుగుతూ ప్రజల సొమ్మును చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నాడని దుయ్యబట్టారు.
భారీ నీటి పారుదల శాఖను దేవినేని ఉమా భారీ అవినీతి శాఖగా మార్చడని వెల్లంపల్లి విమర్శించారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా మొత్తం దేవినేని కనుసన్నల్లో జరుగుతుందన్నారు. ప్రభుత్వ అక్రమాలను బయటపెడుతుంటే ఎదురుదాడికి దిగుతున్నారన్నారు. దేవినేని మానసికస్థితి సరిగ్గా లేనట్లుగా అనిపిస్తుందన్నారు. చంద్రబాబు సర్కార్పై వెల్లంపల్లి ప్రశ్నలు సంధించారు. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి బయటపెట్టిన విషయాలపై దమ్మూ, ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలన్నారు. అదే విధంగా టీఆర్ఎస్తో మీ అనుబంధం ఏమిటీ? 2009 నుంచి కాంగ్రెస్తో అనుబంధం కొనసాగిస్తున్నారా..? ఓటుకు కోట్లు కేసులకు విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధమా..? అని ప్రశ్నించారు. రేవంత్రెడ్డి విషయాలపై సమాధానం చెప్పకపోతే అవి పూర్తిగా వాస్తవమేనన్నారు.