హైదరాబాద్, 1 సెప్టెంబర్ 2013: రాష్ట్ర విభజన విషయంలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని ప్రజలు అసహ్యయించుకుంటున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. ఆత్మగౌరవ యాత్ర పేరుతో చంద్రబాబు నేటి నుంచి చేస్తున్న బస్సు యాత్రకు ప్రజల నుంచి తిరుగుబాటు సెగ తప్పకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు శ్రీనివాసులు ఆదివారం ఉదయం నిమ్సు ఆస్పత్రికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించేందుకు కేంద్రానికి లేఖ ఇచ్చి, తొందరపెట్టిన చంద్రబాబు నాయుడు బస్సు యాత్ర సందర్భంగా ప్రజలకు ఏమని చెబుతారని కొరముట్ల ప్రశ్నించారు. రాజీనామా చేసిన తరువాతే ప్రజలకు వద్దకు వెళ్లాలని చంద్రబాబుకు ఆయన సూచించారు. సీమాంధ్ర ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక సైన్యాన్ని వెంటపెట్టుకుని చంద్రబాబు బస్సు యాత్రకు బయలుదేరడం సిగ్గుచేటు అన్నారు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన రోజునే చంద్రబాబు యాత్ర చేపట్టడం శోచనీయమని అన్నారు. సమన్యాయం కోసం శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి తన ప్రాణాన్ని లెక్కచేయకుండా ఏడు రోజులు నిరవధిక నిరాహారదీక్ష చేయడం గర్వకారణమని శ్రీనివాసులు అన్నారు.