విశాఖపట్నంః గిరిజన సలహా మండలిలోని సభ్యులంతా చంద్రబాబు తొత్తులేనని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిరిజన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ మండిపడ్డారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి ఉపయోగపడే సలహామండలిలో ఎమ్మెల్యేలు కానివారిని సభ్యులుగా ఎలా నియమించారని చంద్రబాబును ప్రశ్నించారు. ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటుపై పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు. బాక్సైట్ తవ్వకాల కోసం చంద్రబాబు తన మనుషులను కమిటీలో సభ్యులుగా చేశారని విమర్శించారు. గిరిజనుల అభివృద్ధి కోసం ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మూడున్నరేళ్లుగా పోరాటం చేస్తున్నారన్నారు. వైయస్ఆర్ సీపీ నుంచి గెలిచిన గిరిజన ఎమ్మెల్యేలు అధికంగా ఉండడంతో ఇన్నినాళ్లు సలహా మండలి ఏర్పాటు చేయకుండా తాత్సారం చేశారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు స్థానం లేకుండా కమిటీ ఏర్పాటు చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.