- ఈ నెల 9న శాసనమండలి ఎన్నికలకు పోలింగ్
- పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ అభ్యర్థికే విజయావకాశాలు
- వైయస్ జగన్ పోరాటాలే గోపాల్రెడ్డి గెలుపునకు సోపానాలు
- వెన్నపూస తరఫున పార్టీ శ్రేణుల సమష్టి ఎన్నికల ప్రచారం
- టీడీపీకి గుణపాఠం చెప్పేందుకు పట్టభద్రులు సమాయత్తం
అనంతపురం: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెన్నపూస గోపాల్రెడ్డికి విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటాలే ఆయన గెలుపునకు సోపానాలు. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి నిరుద్యోగులను మోసం చేశారు. బాబు వస్తేనే జాబు వస్తుందని నమ్మించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని, లేదంటే నెలకు రూ. 2 వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. తీరా టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా ఏ ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి కింద చిల్లి గవ్వ కూడా చెల్లించలేదు. పైగా విభజన చట్టంలోని ప్రత్యేక హోదాను చంద్రబాబే ఢిల్లీకి తాకట్టు పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్న పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల్లో టీడీపీకి గుణపాఠం చెప్పేందుకు నిరుద్యోగులు సమయత్తం అవుతున్నారు.
టీడీపీ ప్రలోభాల పర్వం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాలకు తెరతీసింది. పట్టభద్రులకు కానుకలతో ఎర వేస్తోంది. పశ్చిమ రాయలసీమ పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి కేజే రెడ్డి తరఫున ఆయన ప్రతినిధులు ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. ఈక్రమంలోనే ఎమ్మెల్యే, చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు అధ్యక్షతన పట్టభద్రులు, ఉపాధ్యాయుల సమావేశం జరిగింది.అభ్యర్థి కేజే రెడ్డి, ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజశేఖర్తో పాటు పంచాయతీరాజ్ డీఈ రాజన్న, కేజీబీవీ ప్రత్యేకాధికారులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు హాజరయ్యారు. సమావేశం అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి తరఫున కొందరు ప్రతినిధులు ఉపాధ్యాయులకు కేజే రెడ్డి ఫొటోతో కూడిన బ్యాగులు, నగదు అందజేసి ఓట్లు తమకే వేయాలని అభ్యర్థించారు. ఇంత జరుగుతున్నా ఎన్నికల అధికారులు గానీ, పోలీసులు గానీ అటువైపు రాలేదు.
పోరాట యోధుడు గోపాల్రెడ్డి
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన వెన్నపూస గోపాల్రెడ్డి మంచి పోరాట యోధుడు. ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉద్యోగుల సమస్యలపై అనేక పోరాటాలు చేశారు. ఆయనకు నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయ సమస్యలపై బాగా అవగాహన ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించుకుంటే చంద్రబాబు మెడలు వంచి సమస్యలు పరిష్కరించుకోవచ్చు. ఆయన్ను శాసనమండలికి పంపేందుకు రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సమష్టిగా శ్రమిస్తున్నారు. నోటిఫికేషన్ వెలుబడిన నాటి నుంచి నేటి వరకు అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు మోసాలను మరోమారు నిరుద్యోగులకు, పట్టభద్రులకు వివరించడంతో టీడీపీకి శాసన మండలి ఎన్నికల్లో గుణపాఠం తప్పదన్న సంకేతాలు వెలుబడ్డాయి. దీంతో అడ్డదారిలో గెలిచేందుకు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కేజే రెడ్డి ప్రలోభాలకు తెర లేపారు. మండల కేంద్రాల్లో టీడీపీ నాయకులను రంగంలోకి దించి పట్టభద్ర ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో అనంతపురంలోని ఓ లాడ్జిలో టీడీపీ నేతలు డబ్బులు, ప్రచార కరపత్రాలతో పట్టుబడ్డారు. ఈ పరిణామాలతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమైంది. ఈ నెల 9న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహిస్తే గెలుపు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే.