విజయవాడ: రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలు జరుగుతుంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ నిలదీశారు. రైల్వే జోన్ కోసం గుడివాడ అమర్నాథ్ నాలుగు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్నా పట్టించుకోవటం లేదని ఆయన మండిపడ్డారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైల్వే జోన్ ఉద్యమంలో వామపక్షాలను కలుపుకొని ముందుకెళ్తామని బొత్స స్పష్టం చేశారు. ఈ నెల 20న దీక్షా శిబిరానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆరోజు ఉత్తరాంధ్ర నుంచి భారీగా అభిమానులు వస్తారని బొత్స తెలిపారు. విభజన చట్టంలోని అంశాన్ని నెరవేర్చరా అని ఆయన ప్రశ్నించారు.
అధికార నేతల వ్యక్తగత ప్రయోజనాల కోసం పోలవరాన్ని పక్కదారి పట్టించారని ఆయన విమర్శించారు. విశాఖ మెట్రోకు లక్ష కోట్లు కెటాయిస్తే ఎంపీ హరిబాబు కనీసం నిరసన తెలపలేదని బొత్స మండిపడ్డారు.