చిత్తూరు: ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతులంటే ప్రేమ లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియన్ నాయకులు భూమన కరుణాకర్రెడ్డి విమర్శించారు. ఆదివారం జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొన్న భూమన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు రైతు కుటుంబం నుంచి వచ్చినా ఆయనకు రైతులంటే ప్రేమ లేదని మండిపడ్డారు. బాబు నైజం చిత్తూరువాసులకు బాగా తెలుసు అని గుర్తు చేశారు. ఇక్కడి ప్రజలు ఏనాడు ఆయన్ను సమర్దించలేదని చెప్పారు. చంద్రబాబు ఎప్పుడు కూడా చెప్పింది చేయరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవి కోసం రుణాలు మాఫీ చేస్తానని మాట ఇచ్చి నాలుగేళ్లు పూర్తి అవుతున్నా ఆ హామీ నెరవేరలేదన్నారు. రైతు గోడు పట్టించుకునే నాథుడు లేడన్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టులను వైయస్ జగన్ పూర్తి చేస్తారని చెప్పారు.