'అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ఆర్సిపి జయభేరి తథ్యం'
3 Dec, 2012 14:38 IST
అనంతపురం: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయభేరి మోగించడం తథ్యమని పార్టీ సీఈసీ సభ్యుడు వై. విశ్వేశ్వర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టులను పూర్తిచేసి సాగునీరు తాగునీరు అందించగల ఆయువు, సమర్ధత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేవని విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలంలో ఆదివారం పలు కార్యక్రమాల్లో పాల్గొ తరువాత పార్టీ నాయకుడు శ్రీనివాసులు నివాసంలో విశ్వేశ్వర్రెడ్డి విలేకరులతో మాట్లాడారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు విశేష స్పందన లభిస్తోందన్నారు. ఆమె పాదయాత్రకు వస్తున్న జన స్పందన గ్రామాలకు గ్రామాలే వైయస్ఆర్సిపిలో చేరతాయనడానికి నిదర్శనమన్నారు. తెలంగాణా ప్రజలు కూడా శ్రీమతి షర్మిల పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారని విశ్వేశ్వర్రెడ్డి అన్నారు.
హంద్రీ నీవా పథకం మొదటి దశ పనులను 90 శాతం వరకూ మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి పూర్తిచేసినా మిగిలిన పనులు పూర్తి చేయడానికే ఈ ప్రభుత్వానికి మూడేళ్లు పట్టిందన్నారు. హెచ్ఎల్సీ కింద లక్ష ఎకరాలకు సాగునీరు, పిఎబిఆర్కు పది టిఎంసిల నీటిని కేటాయించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని విశ్వేశ్వర్రెడ్డి ఆరోపించారు. టిడిపి హయాంలో చుక్క నీరు తీసుకురాలేని ఎమ్మెల్యే కేశవ్కు 40 టిఎంసిలపై మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయన అన్నారు.
వైయస్ఆర్సిపిలోకి పలువురు చేరిక:
బెళుగుప్ప బిసి కాలనీకి చెందిన వివిధ పార్టీల నాయకులు శాంతకుమార్, శివకుమార్, తిప్పేస్వామి సహా వందమంది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరంతా మండల కన్వీనర్ దుద్దేకుంట రామాంజనేయులు ఆధ్వర్యంలో విశ్వేశ్వరరెడ్డి సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.
పరిగిలోనూ భారీగా చేరికలు:
టిడిపి, సిపిఎం నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆదివారం పలువురు చేరారు. జిల్లా అడ్హాక్ కమిటీ కన్వీనర్ శంకరనారాయణ సమక్షంలో పెనుకొండ నాయకులు పెట్రోల్ బంకు శివారెడ్డి, మంగమ్మ ఆధ్వర్యంలో దాదాపు 300 మంది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో బోరెడ్డిపల్లికి చెందిన సిపిఎం జిల్లా నాయకుడు రామాంజితో పాటు పరిగి, శ్రీరంగరాజుపల్లిలలోని టిడిపి కార్యకర్తలున్నారు.