అసెంబ్లీ సమావేశాలకు వైయస్ఆర్ కాంగ్రెస్ సిద్ధం
అసెంబ్లీ సమావేశాలకు సర్వ సన్నద్ధంగా ఉన్నట్లు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఆ పార్టీ నాయకులు మేకతోటి సుచరిత, తెల్లం బాలరాజు, శ్రీకాంత్రెడ్డి ఆదివారంనాడు హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని వారు అన్నారు. విద్యుత్ ఛార్జీలు, కరెంటు కోతలు, పరిశ్రమలకు కోతలపై నిలదీస్తామని చెప్పారు. ప్రాణహిత, పోలవరం ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. జలయజ్ఞం పథకం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు.
రైతులకు రుణాలు మంజూరు, విత్తనాల సరఫరా అంశాలను అసెంబ్లీలో ప్రస్తావిస్తామని సుచరిత, బాలరాజు, శ్రీకాంత్రెడ్డి చెప్పారు. అమ్మహస్తం పథకం పంపిణీలో అక్రమాలను ఎత్తిచూపుతామన్నారు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లలో అధికార కాంగ్రెస్ అక్రమాలు ఎండగడతామని చెప్పారు. బెల్టు షాపులపై ప్రభుత్వాన్ని ఈ సమావేశాల్లో నిలదీస్తామన్నారు.